కాంగ్రెస్, రాహుల్ బీజేపీకి 'బీ టీమ్' అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశంలోని విపక్ష నేతలను అరెస్టు చేయడం, ప్రశ్నించేందుకు పిలిపించడం చేస్తున్నాయని, కానీ కేరళ సీఎంను మాత్రం ప్రశ్నించడం లేదని రాహుల్ ఇటీవల కేరళ పర్యటనలో వ్యాఖ్యానించారు. దీనిపైనే తాజాగా పినరయి విజయన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని కేరళ సీఎం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, మెజారిటీ, మైజారిటీ కమ్యూనిటీ పేరుతో మతరాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. మతతత్వం ఏ రూపంలో ఉన్నా దానిని సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ వ్యక్తిరేకిస్తుందని, మతతత్వ కార్యకలాపాల్లో పాల్గొనే ఏ గ్రూప్ మద్దతును తీసుకోదని స్పష్టం చేశారు. శబరిమల బంగారం చోరీ వివాదంపై అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ, కేరళ హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ భిన్నమైన వాదనలు చేస్తున్నప్పటికీ విచారణను ఎక్కడా హైకోర్టు తప్పుపట్టలేదని చెప్పారు. ఈ వివాదంలో ఎవరి ప్రమేయం ఉన్నా ప్రభుత్వం విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సీపీఎంపై విపక్షల ఆరోపణల ప్రభావం ఏప్రిల్ 19న జరిగే ఎన్నికలపై ఏమాత్రం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యారంగంలో పెద్దఎత్తున మార్పులు చేశామని తెలిపారు. విద్యా సంస్థల ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉన్నాయని అన్నారు. వయనాడ్ పునరావాసంతో సహా అనేక అంశాల్లో ఆర్థిక సాయానికి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. కేరళను కేంద్రం ఎంతగానో ఆదుకుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదన్నారు.
0 Comments