అమెరికాను లక్ష్యంగా చేసుకొని ఉత్తర కొరియా ఇంధన క్షిపణి ఇంజిన్ను విజయవంతంగా ప్రరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా అధికారికంగా వెల్లడించింది. ఈ పరీక్షతో అణు దాడి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా ప్యాంగ్యాంగ్ మరో అడుగు ముందుకెళ్లిందని యుద్ధ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్దేశించిన మేరకు క్షిపణి సామర్థ్య ఆధునికీకరణను వేగవంతం చేసింది. ఈ పరీక్షను కిమ్ స్వయంగా వీక్షించారు. తాజాగా పరీక్షించిన ఇంజిన్లో కాంపోజిట్ ఫైబర్ మెటీరియల్ వినియోగించినట్లు కేసీఎన్ఏ ఏజెన్సీ పేర్కొంది. ఇది అత్యధికంగా 2,500 కిలో టన్నుల థ్రస్ట్ సామర్థ్యం కలిగినట్లు పేర్కొన్నారు. ఉత్తరకొరియా అణు వార్హెడ్లను అమెరికా వరకు మోసుకెళ్లేలా ఖండాంతర క్షిపణి సామర్థ్యాలను రానున్న ఐదేళ్లలో మెరుగుపర్చుకుంటామని ఇటీవలే కిమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశం వరుసగా వివిధ రకాల క్షిపణులను పరీక్షిస్తోంది. అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలన్న తమ దేశ నిర్ణయాన్ని ఇటీవల కిమ్ సమర్థించుకున్నారు. ఇరాన్ యుద్ధం వేళ దేశానికి బలమైన సైనిక నిరోధక శక్తి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమెరికా ఉగ్రవాదం, దండయాత్రలు చేస్తోందని కిమ్ దుయ్యబట్టారు. అయితే, తన ప్రసంగంలో ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.
0 Comments