హర్మూజ్ జలసంధి గుండా సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన నౌక సురక్షితంగా భారత్ చేరింది. లిబీరియా జెండాతో, భారత కెప్టెన్ సారథ్యంలో ప్రయాణించిన ఈ ట్యాంకర్ బుధవారం ముంబై పోర్టుకు చేరినట్లు ముంబై పోర్ట్ ట్రస్ట్ వర్గాలు ధృవీకరించాయి. ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి మార్చి 1న బయలుదేరిన ఈ నౌక, ఇరాన్ అధికారుల అనుమతితో హార్ముజ్ జలసంధిని దాటింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్రమైన ఘర్షణ వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో నౌకల రద్దీ గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇటీవల హార్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స నేవీ కమాండర్ అలీరెజా తంగ్సిరి ఇటీవల చేసిన హెచ్చరిక అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 'హార్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణం సాధ్యమా? ఇరాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి వెళ్లాలనుకున్న ఎక్స్ప్రెస్ రోమ్, మయూరీ నారీ నౌకల సిబ్బందిని అడగండి. వాటిని మేము స్వాధీనం చేసుకున్నాం. ఇరాన్ అనుమతి లేకుండా ఏ నౌక ముందుకు వెళ్లలేదు' అని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు మద్దతు పలకని దేశాల నౌకలకు మాత్రమే జలసంధి గుండా సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఈ క్రమంలో భారత జెండా ఉన్న నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని అందిస్తోంది. ఇరాన్-ఒమన్ దేశాల మధ్య ఉన్న ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు వినియోగంలో ఐదో వంతు, అంటే రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది.
0 Comments