ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి, మూడో పెళ్లి చేసుకున్న ఒక ప్రబుద్ధుడు తన కొత్త పెళ్లికూతురిని గోవాలో విక్రయించేందుకు వేసిన మాస్టర్ ప్లాన్ బయటపడటంతో దొరికిపోయాడు. గోరఖ్ పూర్ నివాసి అయిన సదరు నిందితుడు తనను తాను ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. సోషల్ మీడియాలో బుగ్గ కారుతో, సెక్యూరిటీ గార్డులతో దిగిన ఫోటోలను చూపిస్తూ అమాయక కుటుంబాలను బుట్టలో వేసుకునేవాడు. ఈ క్రమంలోనే ఒక యువతి కుటుంబాన్ని నమ్మించి, అట్టహాసంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లికి ముందే ఇతగాడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచాడు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అసలు రంగు బయటపడటం మొదలైంది. హనీమూన్ పేరుతో తన కొత్త భార్యను గోవాకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. అయితే, అది విహారయాత్ర కోసం కాదు. అక్కడ ఆమెను భారీ మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకోవాలనేది అతని అసలు పథకం. ఈ లోపే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన భార్య, ఇంట్లో వెతకగా అతనికి సంబంధించిన నకిలీ ఐడి కార్డులు, పాత పెళ్లిళ్లకు సంబంధించిన ఆధారాలు లభించడంతో షాక్కు గురైంది. నిందితుడు వాడే ఫోన్ , అతని వద్ద ఉన్న కొన్ని డాక్యుమెంట్ల ద్వారా అతను ఒక పెద్ద నేరపూరిత నెట్వర్క్ తో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆమె గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు తన కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకోగా, విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అతను కేవలం పెళ్లిళ్ల కోసమే కాకుండా, ఉద్యోగాల పేరుతో కూడా అనేకమందిని మోసం చేసినట్లు తేలింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతని వెనుక ఉన్న ముఠా ఎవరనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.
0 Comments