దేశంలోని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ముందు పార్టీ నేతలతో, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, డీజీపీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు, నోడల్ అధికారులతో భేటీ జరినట్లు చెప్పారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ చెప్పారు. అర్హత కలిగిన ప్రతీ వ్యక్తిని ఓటర్ల జాబితాలో చేరుస్తామని చెప్పారు. అక్రమ ఓటర్లను తొలగించడానికి సర్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. ఓటర్ల అవగాహన కోసం అధికారులు, యువ ఓటర్లతో మాట్లాడినట్లు తెలిపారు. ఓటింగ్ పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల కోసం 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఈసీ చెప్పింది. దీని కోసం 25 లక్షల మంది ఎన్నికల అధికారుల్ని నియమించారు. 15 లక్షల పోలింగ్ సిబ్బంది, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ అత్యధికంగా 6.44 కోట్ల మంది ఓటర్లతో అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడులో 5.67 కోట్లు, కేరళలో 2.7 కోట్లు, అస్సాంలో 2.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
0 Comments