చైనాలోని క్లాస్రూమ్ల రూపురేఖలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మార్చేస్తోంది. కానీ భారత్ మాత్రం ఇంకా మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే పాత చింతకాయ పచ్చడి నుండి బయటపడలేకపోతోంది. ఏఐ వినియోగంలో ఈ రెండు దేశాల మధ్య నున్న అంతరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2021లో చైనా 'డబుల్ రిడక్షన్' అనే కీలక విధానాన్ని తీసుకొచ్చింది. పైకి ఇది కేవలం ప్రైవేట్ ట్యూషన్లపై ఆంక్షలు అనిపించినా, దీని వెనుక ఒక వ్యూహం ఉంది. విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని తగ్గించి, బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికారు. కేవలం టాపర్లను వెతకడం కంటే, ప్రతి విద్యార్థిలో నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యంగా చైనా స్కూళ్లు ముందడుగు వేస్తున్నాయి. టెక్నాలజీని కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా చైనాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు. భారత్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఏటా మన దేశంలో దాదాపు 9 లక్షల మంది ఇంజనీర్లు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, వారిలో ఎంతమంది ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026' నివేదిక ప్రకారం ప్రతి 10 మంది యువకులలో నలుగురు సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. 'మన విద్యార్థులు పరీక్షలు పాస్ అయ్యేందుకే చదువుతున్నారు తప్ప, సమస్యలను పరిష్కరించడానికి కాదు' అని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి రాజస్థాన్లోని కోట వరకు.. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కోచింగ్ సెంటర్లే నడిపిస్తున్నాయి. ర్యాంకులు, కటాఫ్ మార్కులే విద్యార్థి తెలివితేటలకు కొలమానాలుగా మారిపోయాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నత్తనడకన సాగుతోంది.
0 Comments