ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై మరోసారి ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ మిజాన్ రిపోర్టు చేసింది. ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై శనివారం రోజున వైమానిక దాడి జరిగిందని పేర్కొంది. అయితే ఈ దాడిలో ఎలాంటి రేడియేషన్ లీకేజీ జరగలేదని తెలిపింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా నతాంజ్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్టుగా ఇరాన్కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ కూడా రిపోర్టు చేసింది. అయితే రేడియోధార్మిక పదార్థాల లీకైనట్టుగా ఎలాంటి సంకేతాలు లేవని తెలిపింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా పేర్కొంది. ఇరాన్ అణు ఇంధన సంస్థ కూడా నంతాజ్ అణుశక్తి కేంద్రంపై దాడిని ధ్రువీకరించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపింది. ఈ దాడులకు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. నతాంజ్ అణుశుద్ధి కేంద్రం టెహ్రాన్కు ఆగ్నేయంగా దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించగా తొలి వారంలోనే నతాంజ్ అణు కేంద్రంపై దాడులు జరిగాయి. గతేడాది జూన్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తలెత్తిన సమయంలో కూడా నతాంజ్ అణుశుద్ది కేంద్రాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అయితే తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య జరుగుతున్న యుద్దంలో మరోసారి నతాంజ్ అణుశుద్ది కేంద్రంపై దాడులు జరగడం ఆందోళనలకు దారితీసింది.
0 Comments