టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి నిష్క్రమించిన తర్వాత వెస్టిండీస్ జట్టు స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా అంతర్జాతీయ గగనతల ఆంక్షల వల్ల భారత్లోనే చిక్కుకుపోయింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సోమవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ గల్ఫ్ ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా తలెత్తిన భద్రతా ముప్పుల దృష్ట్యా అంతర్జాతీయ విమాన మార్గాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. దీనివల్ల వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రయాణం వాయిదా పడింది. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, అధికారుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత అని బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వెస్టిండీస్ జట్టు భారత్లోనే సురక్షితంగా ఉందని, ఐసీసీ, సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కేవలం వెస్టిండీస్ మాత్రమే కాకుండా, జింబాబ్వే జట్టు కూడా ఇదే కారణంతో భారత్లో నిలిచిపోయినట్లు సమాచారం. దుబాయ్ మీదుగా వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో ఈ అంతరాయం కలిగింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత లేదా సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గం (ఐరోపా లేదా ఆసియా మీదుగా) ఖరారైన వెంటనే జట్టు ప్రయాణ తేదీని వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆటగాళ్లందరూ క్షేమంగా ఉన్నారని సీడబ్ల్యూఐ భరోసా ఇచ్చింది.
0 Comments