ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాతచెరువు గ్రామంలో నాలుగు నెలల క్రితం జరిగిన ఒక దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన భర్త హనుమంతుతో ఏర్పడిన గొడవలో, భార్య సుకన్య రోకలిబండతో తలపై కొట్టి ఆయన్ను హతమార్చింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంటి ముందే గుంత తీసి పాతిపెట్టింది. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి అందరినీ నమ్మించింది. ఈ నేరానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న తన కుమార్తెను సుకన్య బెదిరించి ఇన్నాళ్లూ మౌనంగా ఉంచింది. అయితే, ఇటీవల తల్లి ప్రవర్తన నచ్చక ఆ యువతి తన బంధువులకు అసలు విషయాన్ని వివరించింది. దీంతో బంధువులు సుకన్యను నిలదీశారు. దీంతో సుకన్య భర్తను చంపిన విషయాన్ని ఒప్పుకుంది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. అయితే సుకన్యకు వేరొక వ్యక్తితో ఉన్న సంబంధమే ఈ గొడవలకు, హత్యకు దారితీసిందని తెలుస్తోంది. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో నిందితురాలు చూపిన చోట తవ్వకాలు జరిపారు. హనుమంతు మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలంలోనే పంచనామా నిర్వహించారు. అనంతరం అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
0 Comments