ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో భారత ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోగా బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 11 నెలల కనిష్టానికి, నిఫ్టీ 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో మదుపర్ల సంపద భారీగా ఆవిరైంది. మార్కెట్ ఒత్తిడిని సూచించే 'ఇండియా VIX' ఒక్కరోజే 22 శాతం పెరిగి 20.83కి చేరడం ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,122.66 పాయింట్లు (1.4%) పతనమై 79,116.19 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55%) తగ్గి 24,480.50 వద్ద ముగిశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ ఏకంగా 1,700 పాయింట్ల మేర నష్టపోయి ట్రేడర్లను వణికించింది. నిఫ్టీలో గ్రాసిమ్, టాటా కన్స్యూమర్, ఎస్బీఐ లైఫ్ వంటి దిగ్గజ షేర్లు 4 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్ గతిని గమనిస్తే కేవలం 759 షేర్లు మాత్రమే లాభాల్లో ఉండగా, 2,945 షేర్లు నష్టాల బాట పట్టాయి. మరోవైపు, డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 69 పైసలు క్షీణించి 92.18 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకడం ఆర్థిక వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం చమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 82.11 డాలర్లకు చేరింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో తెలియని అనిశ్చితి వల్ల వ్యాపార లోటు పెరిగి, రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా మార్కెట్లు కూడా కుదేలయ్యాయి. దక్షిణ కొరియా 'కోస్పి' ఏకంగా 10 శాతం కుప్పకూలగా.. జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరాయంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం దేశీయ మార్కెట్లను మరింత బలహీనపరుస్తోంది. సోమవారం ఒక్కరోజే వీరు రూ. 3,295.64 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
0 Comments