మహారాష్ట్రలో జ్యోతిష్యుడిగా చలామణి అవుతూ, రాజకీయ నాయకులు , ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగి ఉన్న అశోక్ ఖరాత్ (67) ఉదంతం కలకలం రేపుతోంది. ఒక మహిళపై వరుసగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఆరోపణలపై నాసిక్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధిత 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు ప్రకారం, అశోక్ ఖరాత్ ఆమెను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆమెకు తెలియకుండా అసభ్యకరమైన వీడియోలు చిత్రీకరించి, వాటిని బయటపెడతానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. తట్టుకోలేకపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి కార్యాలయంలో పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతని వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి సుమారు 58 అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ ద్వారా రహస్యంగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ వీడియోల ఆధారంగా ఖరాత్ మరికొంతమంది మహిళలను కూడా ట్రాప్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మర్చంట్ నేవీలో పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకుంటూ తనను తాను ‘కెప్టెన్’ అని పిలిపించుకునేవాడు. జ్యోతిష్యుడిగా మంచి పేరు ఉండటంతో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పలుకుబడిని ఉపయోగించుకునే ఇతను ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నాసిక్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిపై అత్యాచారం, బెదిరింపులు, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏదైనా ‘హనీట్రాప్’ కోణం ఉందా? ఇతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే దిశగా విచారణ ముమ్మరం చేశారు.
0 Comments