మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా శ్రీగొండ తాలూకాలో ఉన్న కొల్గావ్ గ్రామం మాత్రం ఒక గొప్ప నిర్ణయంతో ముందుకు వచ్చింది. సుమారు తొమ్మిది వేల జనాభా ఉన్న ఈ వ్యవసాయ ఆధారిత గ్రామంలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారు కలిసి జీవిస్తున్నారు. ఎవరైనా సరే తల్లీచెల్లెళ్ల పేర్లతో బూతులు తిడితే ఏకంగా 500 రూపాయల జరిమానా విధించేలా గ్రామ పంచాయతీ ఒక సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మహిళా గ్రామ సభలో ఈ కఠినమైన రూల్ తీసుకువచ్చారు. భాషలో గౌరవం లేకపోతే సమాజంలో మార్పు రాదని బలంగా నమ్మిన ఈ గ్రామస్థులు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ అరుదైన నిబంధనను అమలు చేస్తున్నారు. ప్రతిరోజూ జరిగే సంభాషణల్లో మహిళలను కించపరిచేలా మాట్లాడటం సాధారణంగా మారిపోయిన ఈ రోజుల్లో, ఇలాంటి చెడు అలవాటును పూర్తిగా రూపుమాపేందుకు గ్రామ సర్పంచ్ పురుషోత్తం లగడ్ ఆధ్వర్యంలో ఈ ప్రతిపాదనను సీరియస్గా తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళా దినోత్సవం రోజున సీనియర్ అంగన్వాడీ కార్యకర్త శకుంతల దేశ్ముఖ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వ్యవసాయంతో పాటు ఇతర రంగాల్లో రాణించిన మహిళలను సత్కరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సన్మాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పూజా జగ్తాప్ అనే స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. గొడవల్లో తల్లీచెల్లెళ్లను లాగుతూ బూతులు మాట్లాడటాన్ని మనం ఎందుకు సహించాలి, ఈ తప్పును ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు అని ఆమె అడిగారు. కుటుంబ బాధ్యతలు మోసే మహిళల గుర్తింపును ఇలాంటి అసభ్య పదజాలంతో అవమానించకూడదని ఆమె స్పష్టం చేశారు. పూజా జగ్తాప్ అడిగిన ఈ ప్రశ్న అక్కడున్న వారందరినీ ఆలోచింపజేసింది. వెంటనే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన గ్రామ సభ, బూతులు తిట్టే వారిపై జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ కొత్త రూల్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ పక్కాగా ఒక షరతు పెట్టింది. ఎవరైనా బూతులు మాట్లాడినట్లు డిజిటల్ ఆధారాలు (వీడియో లేదా ఆడియో రికార్డింగ్) సమర్పిస్తేనే ఈ 500 రూపాయల జరిమానా విధిస్తారు. మహిళల నుంచే ఈ ప్రతిపాదన వచ్చింది కాబట్టి, తప్పు చేసే వారిని గుర్తించే బాధ్యతను కూడా మహిళలే తీసుకోవాలని పంచాయతీ కోరింది. ఇలా వసూలు చేసిన జరిమానా డబ్బును గ్రామ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ఖర్చు చేస్తారు. ఇదే గ్రామ సభలో పరిశుభ్రతకు సంబంధించి మరో ముఖ్యమైన తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఎవరైనా తమ ఇళ్లు లేదా దుకాణాల పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచితే, దానికి సంబంధించిన ఫోటో ఆధారంగా 100 రూపాయల జరిమానా విధిస్తారు. కొల్గావ్ గ్రామం ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నుంచి ఈ గ్రామంలో మరో అద్భుతమైన నియమాన్ని పాటిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పిల్లలు చదువుకునే సమయంలో ఇళ్లలో ఎవరూ టీవీలు చూడరు, మొబైల్ ఫోన్లు వాడరు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూడా ఈ రూల్ను కచ్చితంగా పాటిస్తారు. సమాజంలో మార్పు రావాలంటే పెద్దపెద్ద చట్టాలు మాత్రమే కాకుండా, ఇలాంటి స్థానిక ప్రయత్నాలు కూడా చాలా అవసరం. భాషను గౌరవప్రదంగా మార్చేందుకు కొల్గావ్ తీసుకున్న ఈ చిన్న అడుగు, దేశవ్యాప్తంగా మిగతా గ్రామాలకు ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
0 Comments