ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ ధురందర్ 2 ఒక్క రోజులోనే దేశీయంగా ₹100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లకు పైగా వసూలు చేసి, కేవలం మూడు రోజుల్లోనే ₹500 కోట్ల మార్కును దాటేసింది. బాక్సాఫీస్ అప్డేట్: 2025 నాటి బ్లాక్ బస్టర్ 'ధురందర్'కు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం, మార్చి 19న థియేటర్లలో విడుదలైంది. అంతకుముందు మార్చి 18న జరిగిన పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ₹75 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. మొదటి రోజు ₹165 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, శుక్రవారం కొంచెం తగ్గినా.. శనివారం మళ్లీ పుంజుకుంది. శనివారం ఒక్క రోజే ఇండియాలో ₹113 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీనితో మూడు రోజులకు గాను దేశీయ వసూళ్లు ₹339 కోట్ల నెట్ (₹404 కోట్ల గ్రాస్) కు చేరుకున్నాయి. ఓవర్సీస్ వసూళ్లు: విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటివరకు 16 మిలియన్ డాలర్లు (సుమారు ₹140 కోట్లు) వసూలు చేసింది. దీనితో ప్రపంచవ్యాప్త మొత్తం గ్రాస్ వసూళ్లు ₹545 కోట్లకు చేరాయి. ఆదివారం నాటికి ఈ చిత్రం ₹700 కోట్ల మార్కును సునాయాసంగా దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ రికార్డులు కనుమరుగు: కేవలం మూడు రోజుల్లోనే 'బార్డర్ 2' (₹470 కోట్లు), 'వార్' (₹475 కోట్లు), 'టైగర్ 3' (₹464 కోట్లు) వంటి పెద్ద సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లను ధురందర్ 2 అధిగమించింది. శనివారంతో షారుఖ్ ఖాన్ 'డంకీ' (₹470 కోట్లు) రికార్డును కూడా రణవీర్ సింగ్ బద్దలు కొట్టారు. 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.
0 Comments