ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వాంఖడే స్టేడియం సిబ్బందికి లక్షల రూపాయల విలువైన చెక్కులను అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. భారత జట్టు కోసం పూర్తిస్థాయిలో రాణించడానికైనా, లేదా ఎవరికైనా ఇచ్చిన మాటకైనా, అతను ఎప్పుడూ వెనక్కి తగ్గడు. హార్దిక్ పాండ్యా ఎప్పుడూ తన మాటను నిలబెట్టుకుంటాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో పనిచేస్తున్న 11 మంది గ్రౌండ్స్కీపర్లకు హార్దిక్ ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. హార్దిక్ 2026 టీ20 ప్రపంచకప్కు సిద్ధమవుతున్నప్పుడు, ఈ గ్రౌండ్స్కీపర్లు అతనికి ఎంతో సహాయం చేశారు. అందుకోసమే ఈ గిఫ్ట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. నేషనల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, 2026 టీ20 ప్రపంచ కప్ కోసం సిద్ధమయ్యేందుకు హార్దిక్ వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ట్రైనింగ్ తీసుకునేవాడు. దీంతో గ్రౌండ్ సిబ్బంది చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఈ విధంగా గ్రౌండ్ సిబ్బంది హార్దిక్కు అతని శిక్షణలో తమ వంతు సహాయం అందించారు. 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచి తిరిగి వచ్చాక అందరికీ మంచి గిఫ్ట్ ఇస్తానని హార్దిక్ పాండ్యా మాట ఇచ్చాడు. ఇప్పుడు హార్దిక్ ఆ మాట నిలబెట్టుకున్నాడు. అతను సభ్యులందరికీ చెక్కులు అందజేసి, వారితో కలిసి ఫోటో దిగాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
0 Comments