జగదల్పూర్లో 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగుపోయారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అడవుల్లో కొనసాగుతున్న 'ఆపరేషన్ కగార్' గడువు ముగుస్తున్న తరుణంలో ఈ సరెండర్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు తప్పుకుంటుండటంతో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా దళాల ఒత్తిడి పెరగడం మరియు గాలింపు చర్యలు ముమ్మరం కావడంతో మావోయిస్టులకు ఇప్పుడు మనుగడ కష్టంగా మారింది. లొంగుబాటుతో పాటు పోలీసులు భారీ ఎత్తున ఆయుధాల డంప్ను కూడా స్వాధీనం చేసుకోవడం గమనార్హం. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను పట్టుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో అత్యాధునిక తుపాకులతో పాటు పేలుడు పదార్థాలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఈ పరిణామంతో అడవిలో మావోయిస్టుల సత్తా గణనీయంగా తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని లొంగిపోయిన వారికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. బాంబుల మోత లేని ప్రశాంతమైన జీవనం గడపాలన్న ఆకాంక్షతోనే ఈ 108 మంది బయటకు వచ్చారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని లొంగుబాట్లు జరిగే అవకాశం ఉందని, అడవిని వీడి రావాలనుకునే వారికి పోలీసులు స్వాగతం పలుకుతున్నారని ఈ సందర్భంగా ప్రకటించారు.
0 Comments