శబరిమల ఆలయంలోకి ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని అనుమతించకూడదని కేరళలోని సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది.క్యాబినెట్ మీటింగ్లో దీనిపై ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. భక్తుల మనోభావాలు, ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల్ని దృష్టిలో ఉంచుకుని, వాటిని కాపాడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, త్వరలోనే కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజకీయ కోణంలోనే ఎల్డీఎఫ్ (లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్) ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలకు ప్రవేశం కల్పించాలని కొన్నేళ్లక్రితం ఆందోళనలు చెలరేగాయి. అయితే, ఈ నిర్ణయాన్ని శబరిమల ఆలయ యాజమాన్య బాధ్యతలు చూసే ట్రావెన్కోర్ దేవస్తాన బోర్డు వ్యతిరేకించింది. ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం ప్రకారం.. మహిళలకు మెనుస్ట్రువల్ సైకిల్ ఉండే పదేళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసు మహిళల్ని ఆలయంలోకి అనుమతించబోమని తెలిపింది. ఈ నిర్ణయాన్ని 2018లో ప్రభుత్వం వ్యతిరేకించింది. అన్ని వయసుల వారికి ఆలయ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం అందరు మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చని తెలిపింది. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. పాత సంప్రదాయాల ప్రకారమే 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం విధిస్తామని కోర్టుకు తెలిపింది. ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పేందుకు తుది గడువు ఈ రోజే. అందుకే తాజా నిర్ణయాన్ని నేడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై వచ్చే నెల 7 నుంచి సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. మరోవైపు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇంతకాలం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై నమోదైన కేసుల సంగతేంటని ప్రశ్నిస్తున్నాయి.
0 Comments