ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు ఇవాళ ఊరట లభించింది. చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గుంటూరు కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇవాళే అంబటిపై దాఖలైన 35 కేసుల్లో ఊరటనివ్వగా మిగిలిన ఒక్క కేసులోనూ గుంటూరు కోర్టులో ఆయనకు ఊరట దక్కింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుపై గుంటూరులోని నల్లపాడు పోలీసులు కేసు నమోదుచేశారు. ఇదే కేసులో ఆయన్ని రాత్రికి రాత్రి అరెస్టు చేసి ఉదయం కోర్టులో హాజరుపర్చడంతో పాటు రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపేశారు. అప్పటి నుంచీ ఆయన రాజమండ్రి జైల్లోనే ఉన్నారు. అదే సమయంలో అంబటిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అంబటి తనకు బెయిల్ ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను విచారించిన గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. మరోవైపు తాజా పరిణామాలను ముుందే ఊహించిన పోలీసులు.. గతంలో మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం అమలు సందర్భంగా గుంటూరులో నిరసనలకు దిగిన నమోదైన కేసులో ఆయన్ను ఇవాళ రాజమండ్రి జైలు నుంచి పీటీ వారెంట్ పై గుంటూరుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులోనూ అంబటికి బెయిల్ లభిస్తే తప్ప ఆయన జైలు నుంచి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంబటి గుంటూరు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశాాలు కనిపిస్తున్నాయి.
0 Comments