Ad Code

ఏఐ వార్ రూమ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి : ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి ప్రతిపాదన


ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి కీలక ప్రతిపాదన చేసారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్‌లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాటిని భారత్ అందిపుచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఆరునెలలకు ఓసారి హైదరాబాద్​ వంటి ప్రదేశంలో ఏఐ సదస్సులు జరగాలని పేర్కొన్నారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని సీఎం స్పష్టం చేశారు. మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో ప్రస్తావించారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని అభివర్ణించారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని పేర్కొన్నారు. రోబోటిక్స్‌తో కలిసినప్పుడు యంత్రాలు మానసిక మేథస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని వివరించారు. ఏఐలో స్టార్టప్‌లను భారత్‌ ప్రోత్సహించాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్‌ తరహాలో ఏఐ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను పిలుపునిచ్చారు. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని.. కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సూచించారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ.. కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని పేర్కొన్నారు. స్టార్టప్‌లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే 'ఏఐ స్టార్టప్ విలేజ్'ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Post a Comment

0 Comments

Close Menu