తెలంగాణలోని కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మీడియా సమవేశంలో మాట్లాడుతూ తాను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చామని చెప్పుకుంటూ ఇంఛార్జ్ మంత్రితో షబ్బీర్ అలీ ప్రారంభోత్సవాలు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా కామారెడ్డి నియోజకవర్గంలో తాను మాట్లాడకుండా ఉంటే తన నియోజకవర్గానికి నవాబు లాగా షబ్బీర్ అలీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు పోటీ చేసి ఓటమిపాలైన షబ్బీర్ అలీ అవినీతి బాగోతం గురించి ముఖ్యమంతి రేవంత్ రెడ్డి కి వివరించానని ఇప్పటి వరకు కామారెడ్డిలో ఏది జరిగినా మౌనంగా ఉన్నానని, ఇక నుంచి భరించే ప్రసక్తే లేదని తెలిపారు. ప్రభుత్వ కళాశాల ఆస్తుల విషయంలో తాను ఏదైనా అవినీతి చేసినట్టు ఆధారాలతో సహా నిరూపిస్తే, తాను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డి ప్రభుత్వ కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలని తన తండ్రితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తో మాట్లాడానని ఆ సమయంలో షబ్బీర్ అలీ మంత్రి హోదాలో ఉండి కూడా కామారెడ్డికి ఏమి చేయలేదని ఆరోపించారు. ఒకవేళ తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వెంకట రమణా రెడ్డి తేల్చి చెప్పారు. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తానని నిజమైన నాయకులెవరైనా ఉంటే తన తప్పు నిరూపించాలని సవాల్ విసిరారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు, శిశు మందిర్ పాఠశాల, అరోరా కాలేజీ భూముల కబ్జా విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి సవాల్ విసిరారు. దీంతో చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో శిశు మందిర్ వేదికగా చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ నేత కారు ధ్వంసం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
0 Comments