బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రోహిత్ శెట్టి ఇంటిపై జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబైలోని జూహూలో ఉన్న రోహిత్ శెట్టి ఇంటిపై శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి బయట కాల్పులు జరిపి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. దీనిపై ఫిర్యాదు అందడంతో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని పూణేలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అమన్ ఆనంద్ మారోట్ (27), ఆదిత్య జ్ఞానేశ్వర్ గయాకి (19), సిద్ధార్థ్ దీపక్ యెన్పూరె (20), సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ (18), స్వప్నిల్ బందు సాకత్ (23) అనే నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు సమాచారం. రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జరిపింది తామే అని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో సంబంధం ఉన్న అన్మోల్ గ్యాంగ్ ప్రకటించుకుంది. దీనికి సంబంధించి ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.
0 Comments