ఏఐ జనరేటెడ్ కంటెంట్, డీప్ఫేక్ల వల్ల తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు, వీడియోలు లేదా ఆడియోలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా 'ఏఐ జనరేటెడ్' అనే లేబుల్ను వేయాలని కేంద్రం ఆదేశించింది. సామాన్యులు కూడా అది ఏఐ కంటెంట్ అని సులభంగా గుర్తించేలా ఆ లేబుల్ స్పష్టంగా ఉండాలి. ఒకసారి లేబుల్ వేసిన తర్వాత దానిని తొలగించడానికి గానీ, మెటా డేటాను మార్చడానికి గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం విధించిన నిబంధనలలో అత్యంత కీలకమైనది 'తొలగింపు గడువు'. ఏదైనా ఏఐ కంటెంట్ లేదా డీప్ఫేక్ కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశిస్తే, సదరు సోషల్ మీడియా సంస్థ కేవలం 3 గంటల లోపు దానిని ప్లాట్ఫామ్ నుండి తొలగించాల్సి ఉంటుంది. ఏఐ కంటెంట్ను దుర్వినియోగం చేస్తే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, జైలు శిక్షల గురించి ప్రతి మూడు నెలలకోసారి యూజర్లకు సందేశాలు పంపాలని కేంద్రం సూచించింది. అసభ్యకర, మోసపూరిత కంటెంట్ను గుర్తించేందుకు ప్లాట్ఫామ్లు సొంతంగా 'ఆటోమేటెడ్ టూల్స్' ఉపయోగించాలని కేంద్రం ఆదేశించింది.
0 Comments