బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం 'అభివృద్ధి వ్యతిరేక'గా మారిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విమర్శించారు. రైల్వే ప్రాజెక్టులు, మరేదైనా ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం లేకుండానే అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. అలాగే కోల్కతా మెట్రో ప్రాజెక్టును ఉదాహరణగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును మంత్రి ఎండగట్టారు. కోల్కతా మెట్రో ప్రారంభమైన మొదటి 40 ఏళ్లలో కేవలం 25 కిలోమీటర్ల నెట్వర్క్ మాత్రమే పూర్తయిందని గుర్తు చేశారు. అలాగే గత 11 ఏళ్లలోనే ఏకంగా 45 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. కేంద్రం సహాయంతో ఎంతో పురోగతి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత కీలకమైన చింగ్రిఘాట వద్ద పనులు గత రెండేళ్లుగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. మెట్రో ప్రాజెక్టు పూర్తి కాకూడదనే ఉద్దేశంతోనే పనులకు అనుమతులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆరోపించారు. అలాగే మెట్రో ప్రాజెక్టు పూర్తయితే కోల్కతా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని, ఇది పశ్చిమ బెంగాల్ గర్వించదగ్గ విషయమని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. సామాన్య పౌరులకు సురక్షితమైన, సమర్థవంతమైన, సరసమైన రవాణా సౌకర్యాన్ని మెట్రో అందిస్తుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం అది జరగకూడదని కోరుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము ఆగబోమని, పశ్చిమ బెంగాల్లోని ప్రతి నివాసికి ఇచ్చిన హామీని పూర్తి బాధ్యతతో నెరవేరుస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
0 Comments