కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో భాగంగా అడోబ్ నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది. భారత్ లో గుర్తింపు పొందిన సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అడోబ్ ఫోటోషాప్, అక్రోబాట్, అడోబ్ ఫైర్ఫ్లై టూల్స్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. అడోబ్ కు చెందిన AI ఆధారిత క్రియేటివిటీ, ప్రొటక్టివిటీ యాప్స్ ను ఉచితంగా అందించడంతోపాటు ఆయా యాప్స్ ను వినియోగించడంలో సాయపడే విధంగా కరిక్యూలమ్ కూడా అందిస్తామని చెబుతోంది. దేశంలోని సుమారు రూ.15 వేల స్కూళ్లు, 500 కాలేజీల్లో ఏర్పాటు చేయనున్న కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ద్వారా ఇందుకు సంబంధించిన శిక్షణ ఇస్తామని అడోబ్ చెబుతోంది. నాస్కామ్ తో కలిసి AI లెర్నింగ్ కోర్సులు, సర్టిఫికేషన్లను కూడా అందిస్తామని అడోబ్ తెలిపింది. ప్రస్తుతం అడోబ్ సంబంధిత యాప్లను వినియోగించుకొనేందుకు నెలవారీ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. అడోబ్ తాజా ప్రకటనతో లక్షలాది మంది విద్యార్థులకు మేలు జరగనుంది. భారతీయ విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నైపుణ్యాలను పొందడంలో సాయం చేస్తామని, వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేసే దిశగా అడుగులు వేసినట్లు అడోబ్ సీఈవో శంతను నారాయణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. 2030 నాటికి విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, యానిమేషన్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవలే ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఆడోబ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం మోడల్ ను ఎయిర్టెల్ యూజర్లు పూర్తి ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లతోపాటు బ్రాడ్ బ్యాండ్, DTH యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇప్పటికే ఎయిర్టెల్ తెలిపింది. అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సాధారణ ధర రూ.4000 గా ఉందని, తమ యూజర్లకు సంవత్సరం వరకు ఉచితంగా వినియోగించుకొనే అవకాశం కల్పించినట్లు తెలిపింది.
0 Comments