ఉత్తరప్రదేశ్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితులైన చిన్నారుల మెడికల్ రిపోర్ట్ విడుదలైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మైనర్లపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. బుధవారం ప్రయాగ్రాజ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు వైద్యుల బృందం బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సీల్డ్ కవర్లో నివేదికను గురువారం దర్యాప్తు అధికారికి అందజేశారు. ఈ నివేదికను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాతే అవిముక్తేశ్వరానందపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ కేసు వివరాలను వెల్లడించలేమని అధికారులు తెలిపారు. శంకరాచార్యపై ఫిర్యాదు చేసిన జగద్గురు రాంభద్రాచార్య శిష్యుడు అశుతోష్ మహరాజ్ మాట్లాడుతూ, ఈ కేసులో తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. మెడికల్ పరీక్షల్లో చిన్నారులపై లైంగికదాడి జరిగినట్లు తేలిందని.. త్వరలోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బాధిత విద్యార్థి మొదటిసారిగా 'ఆజ్ తక్' మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తాను చదువుకోవడానికి ఆశ్రమానికి వెళ్లానని.. అక్కడ తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఇతర పిల్లలపై కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. కాగా, బుధవారం అర్ధరాత్రి శంకరాచార్య తరపు న్యాయవాది మొబైల్కు బెదిరింపు కాల్ వచ్చింది. వారణాసి కోర్టు సముదాయాన్ని బాంబుతో పేల్చివేస్తామని, న్యాయవాదిని కూడా చంపేస్తామని ఆ సందేశంలో హెచ్చరించినట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా ప్రయాగ్రాజ్ పోలీసులు వారణాసిలో మోహరించారు. కాగా, ఉత్తరప్రదేశ్లో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతితో పాటు ఆయన శిష్యడు ముకుందానంద గిరిపై ప్రయాగ్ రాజ్ ఫోక్సో ప్రత్యేక కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. సెక్షన్ 173 కింద ఆయనపై కేసు నమోదు చేసింది. జ్యోతిష్య పీఠం కేసులో మైనర్లుపై లైంగిక దాడి కేసులో ఇద్దరు మైనర్ల వాంగ్మూలాలను కోర్టు స్వీకరించింది. జనవరి 28న అవిముక్తేశ్వరంద్ సరస్వతి ఆశ్రమంలో మైనర్ పిల్లలపై లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 13న కోర్టు నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నిందితులలపై కేసు నమోదు చేసి విచారించాలని ఆదేశించింది.
0 Comments