తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం 387 కోట్లను విడుదల చేసింది. దీంతో పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం లభించనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం, కేంద్రం కోరిన అన్ని సాంకేతిక వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సమర్పించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం విడతలవారీగా నిధులను విడుదల చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రావాల్సిన మొత్తం నిధుల్లో ఇప్పటికీ సుమారు రూ. 2,400 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మొత్తం రూ. 3,000 కోట్లకు పైగా నిధులు అందాల్సి ఉండగా, కేంద్రం నిబంధనల ప్రకారం దశలవారీగా వీటిని కేటాయిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కేంద్రం కోరిన నిబంధనలన్నీ రాష్ట్రం అమలు చేసిందని, సకాలంలో నిధులు అందితేనే గ్రామాల రూపురేఖలు మార్చడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
0 Comments