ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల రాబడి, ఆర్ధిక స్థితిగతులపై చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'పన్నుల రాబడిలో ఏపీ దేశంలోనే 22 వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ లెక్కలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్రం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రజలను భ్రమ కల్పిస్తున్నారు. 2024-25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75% గా ఉందననీ.. జాతీయ వృద్ధిరేటు 9.8% మాత్రమేనని చంద్రబాబు ప్రకటించారు. అలాగే 2025-26లో రాష్ట్ర వృద్ధి 10.75%గా ఉంటుందనీ, జాతీయ వృద్ధిరేటు 8.0% మాత్రమేనని ప్రకటించారు. దీని ప్రకారం 2023-24 నుంచి 2024-25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధిరేటు 11.09%గా చూపిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారుచేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ గణాంకాలు నిజమైతే, ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి తొమ్మిది నెలల కాగ్ నివేదికలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 1.97% మాత్రమే. 11.09% వంటి భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97% వృద్ధిని సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఏపీ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64% పెరగ్గా, ఏపీ పన్ను ఆదాయాలు మాత్రం 1.97% మాత్రమే పెరిగాయి. అయినప్పటికీ ఏపీ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట!. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఏదైనా విషయాల్లో మొదటి స్థానం సాధించిందంటే అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్షసాధింపు చర్యలు, తప్పుడు ప్రచారాల్లోనే' అంటూ దుయ్యబట్టారు.
0 Comments