అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో సూపర్-8 మ్యాచ్లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి విండీస్ను చిత్తు చేసింది. ఈ విజయంతో సౌతాఫ్రికా గ్రూప్-1 నుంచి సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకోగా వెస్టిండీస్ సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. జాసన్ హోల్డర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49), రొమారియో షెఫర్డ్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 52 నాటౌట్) అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ఈ ఇద్దరూ 8వ వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(3/30) మూడు వికెట్లు తీయగా.. కగిసో రబడా, కార్బిన్ బోష్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం సౌతాఫ్రికా 16.1 ఒవర్లలో వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి గెలుపొందింది. ఎయిడెన్ మార్క్రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. క్వింటన్ డికాక్(24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 47), ర్యాన్ రికెల్టన్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 45 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీసాడు. సౌతాఫ్రికా విజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. ఎలాంటి రన్రేట్ టెన్షన్ లేకుండా జింబాబ్వేతో పాటు వెస్టిండీస్తో తమ తదుపరి మ్యాచ్లను భారత్ గెలిస్తే సరిపోతుంది. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిబాట పడుతుంది. మరోవైపు ఈ ఘోర పరాజయంతో వెస్టిండీస్ రన్రేట్ కూడా భారీగా పడిపోయింది. +5.350 నుంచి 1.791కు వెస్టిండీస్ రన్ రేట్ తగ్గింది. భారత్తో జరిగే తమ ఆఖరి మ్యాచ్లో విజయం సాధిస్తేనే విండీస్ సెమీస్ చేరనుంది. లేదంటే ఇంటిబాట పట్టనుంది.
0 Comments