Ad Code

ఏప్రిల్ 1 నుంచి విశాఖ రైల్వే డివిజన్ కార్యకలాపాల ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన విశాఖ రైల్వే డివిజన్ కార్యకలాపాల నిర్వహణకు  ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆపరేషన్స్ ఆరంభానికి డేట్ ఫిక్స్ చేసారు. తాజా నిర్ణయంతో ఇక దక్షిణమధ్య రైల్వే జోన్‌ ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లకే పరిమితం కానుంది. అదే సమయంలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పు కోస్తా జోన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొనసాగనుంది. డివిజన్ల పరిధి కుదింపు, సాంకేతిక అంశాలు, సిబ్బంది సర్దుబాటు పైన నిర్ణయం తీసుకున్నారు. డివిజన్ల వారీ విభజన, సరిహద్దుల మార్పులు, ఆదాయ-వ్యయాల లెక్కలు, రైళ్ల నిర్వహణ వంటి అంశాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు ఇప్పటికే నివేదించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు కేంద్రం అధికారికంగా ఆమోద ముద్ర వేయటంతో ఇక ఆపరేషన్స్ ప్రారంభించేలా తాజాగా కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే కొత్త జోన్‌కు సంబంధించిన జనరల్ మేనేజర్, విభాగాధిపతుల నియామకాలను బోర్డు దశలవారీగా పూర్తి చేస్తోంది. పునర్విభజనలో భాగంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు-వాడి మధ్య 108 కిలోమీటర్ల రైలు మార్గం ఇకపై సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం గుంటూరు డివిజన్‌లో ఉన్న విష్ణుపురం-పగిడిపల్లి,విష్ణుపురం-జాన్‌పహాడ్ మార్గాలు కలిపి మొత్తం 142 కిలోమీటర్లు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ కానున్నాయి. అలాగే 46 కిలోమీటర్ల మోటుమర్రి-కొండపల్లి రైలు మార్గం సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్ట్‌లకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్లలో స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇలా కొత్త రైల్వే జోన్ వల్ల అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక, కొత్త రైళ్ల విషయం లోనూ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu