ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లా సికంద్రాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అద్దె ఇంట్లో రాజు, వీరు కశ్యప్ అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తున్నారు. జనవరి 2న అదే బిల్డింగ్లోని వేరే పోర్షన్లో నివసించే ఆరేళ్ల బాలిక టెర్రస్పై ఆడుకుంటున్నది. ఇది గమనించిన ఆ వ్యక్తులు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత టెర్రస్ పైనుంచి ఆమెను కిందకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను ఆమె తల్లిండ్రులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఇద్దరు వ్యక్తులపై బాలిక తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిద్దరూ తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్లో రాజు, వీరు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి పోలీసుల బృందం వెళ్లగా నిందితులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుల కాళ్లపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అనంతరం వారిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
0 Comments