బెంగళూరులోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు రూ.4 లక్షల లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. చిట్ ఫండ్ ఫ్రాడ్, చీటింగ్ కేసులకు సంబంధించి మొహమ్మద్ అక్బర్ అనే బిల్డర్ను నిందితుల లిస్ట్ నుండి తొలగించడానికి ఇన్స్పెక్టర్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. మొత్తం రూ.5 లక్షల డీల్లో అక్బర్ ఇప్పటికే జనవరి 24న రూ.లక్ష ఇచ్చాడు. మిగిలిన రూ.4 లక్షలు తీసుకోవడానికి సిరిసి సర్కిల్ సమీపంలోని సిఏఆర్ గ్రౌండ్ వద్దకు తన అధికారిక పోలీస్ జీపులోనే యూనిఫాంలో వచ్చిన గోవిందరాజును లోకాయుక్త అధికారులు పక్కా ప్లాన్తో పట్టుకున్నారు. బాధితుడు అక్బర్ లోకాయుక్తను ఆశ్రయించాడు. అధికారులు ఫినాల్ఫ్తలీన్ పౌడర్ పూసిన కరెన్సీ నోట్లను ఆయనకు ఇచ్చి పంపారు. గోవిందరాజు ఆ డబ్బును తీసుకోగానే లోకాయుక్త టీం అటాక్ చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. గతంలో కూడా ఇదే కేసు విషయంలో ఇన్స్పెక్టర్ లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితుడు ఆరోపించారు. దీనిపై తగిన సాక్ష్యాలను, ఆడియో రికార్డింగ్లను కూడా లోకాయుక్తకు సమర్పించారు. ప్రస్తుతం గోవిందరాజుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
0 Comments