Ad Code

నాయుడుపేటలో భారీ సోలార్ తయారీ కేంద్రం !


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎంపీసెజ్ పరిధిలో భారీ సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి.. వెబ్‌సోల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. రూ.3,538 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 8 గిగావాట్ల సామర్థ్యంతో (4 గిగావాట్ల సోలార్ సెల్స్, 4 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్) పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ సోలార్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా నేరుగా సుమారు 2,000 మందికి ఉపాధి లభించనుండగా.. పరోక్షంగా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ సోలార్ తయారీ కేంద్రాన్ని మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశను 2027 జులై నాటికి, రెండో దశను 2028 జులై నాటికి వాణిజ్య ఉత్పత్తికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా ప్లాంట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ను కూడా పునరుత్పాదక వనరుల ద్వారానే ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 300 ఎకరాల భూమిని కేటాయించగా, వెబ్‌సోల్ సంస్థ 100 మెగావాట్ల సామర్థ్యంతో సొంత సోలార్ పవర్ ప్లాంట్‌ను నిర్మించనుంది. దీని వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, పర్యావరణ హితమైన గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్ మోడల్ అమలులోకి రానుంది. ఈ పెట్టుబడితో నాయుడుపేటతో పాటు దక్షిణ తమిళనాడు పారిశ్రామిక కారిడార్ దేశంలోనే కీలకమైన సోలార్ తయారీ హబ్‌గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రీమియర్ ఎనర్జీస్, టాటా పవర్, వోల్ట్‌సన్ వంటి ప్రముఖ సంస్థలు తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. సరఫరా గొలుసు, లాజిస్టిక్స్ సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పోర్టు కనెక్టివిటీ వంటి అంశాలతో ఈ ప్రాంతంలో బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్ ఏర్పడుతోంది. ఈ పెట్టుబడిపై వెబ్‌సోల్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సోహన్ లాల్ అగర్వాల్ స్పందిస్తూ.. భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాల దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లభించిన మద్దతు తమ విస్తరణ ప్రణాళికలకు ఎంతో బలాన్నిస్తుందని తెలిపారు. అనుకూల పారిశ్రామిక వాతావరణం వల్ల 8 గిగావాట్ల వృద్ధి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్వాగతించారు. వెబ్‌సోల్ రూ.3,500 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీ తయారీ రంగంలో అత్యంత పోటీతత్వ గమ్యస్థానంగా నిలబెడుతుందని ఆయన పేర్కొన్నారు. వేగవంతమైన భూ కేటాయింపులు, సింగిల్ డెస్క్ అనుమతులు, నమ్మకమైన విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలతో ప్రపంచ స్థాయిలో పోటీపడే సోలార్ తయారీ వాతావరణాన్ని రాష్ట్రంలో నిర్మిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సౌరశక్తి తయారీ రంగంలో దేశంలోనే ముందంజలో నిలిచే దిశగా ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలవనుంది.

Post a Comment

0 Comments

Close Menu