తిరుపతిలోని పరిపాలనా భవనంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈవో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమలలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు రెండు పూటలా ఉచిత అన్నప్రసాద వితరణ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అన్ని ఆలయాల్లో: ప్రస్తుతం 56 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. మార్చి నెలాఖరు నాటికి టీటీడీ పరిధిలోని ప్రతి ఆలయంలో భక్తులకు రెండు పూటలా భోజనం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అస్సాం (గౌహతి), బీహార్ (పాట్నా), తమిళనాడు (కోయంబత్తూరు), కర్ణాటక (బెల్గాం) రాష్ట్రాల్లో కొత్తగా టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా ప్రభుత్వాలు స్థలాలు కేటాయించాయి. వీటిని త్వరలోనే స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించనున్నారు. ఉత్తరాఖండ్లోని రుషికేశ్లో శిథిలావస్థకు చేరిన యాత్రికుల సౌకర్యాల సముదాయం స్థానంలో ఫిబ్రవరి కల్లా కొత్త భవన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వేద పారాయణదారులుగా ఎంపికైన వారిలో మిగిలిన 536 మందికి ఫిబ్రవరిలో నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. 150 మంది అర్చకులు, 68 మంది పోటు వర్కర్లకు ఫిబ్రవరిలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. భక్తుల నుంచి వస్తున్న ఈ-మెయిల్స్ను ఎప్పటికప్పుడు విశ్లేషించి, వారు కోరుతున్న మార్పులు మరియు సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్లో అప్డేట్ చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు.
0 Comments