ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పుట్లూరు నుంచి కడవకల్లుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సును రోడ్డు పక్కకు నిలిపి, క్షణాల్లోనే విద్యార్థులందరినీ కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ప్రమాదంలో పుట్లూరు శ్రీ రామ గ్లోబల్ స్కూల్కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే బస్సు మొత్తం మంటల్లో కాలి పోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్ వాహనాల భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
0 Comments