ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మందుబాబులకు స్థానిక పోలీసులు తమదైనశైలిలో వినూత్న శిక్ష విధించారు. తప్పతాగి ఇష్టానుసారంగా ప్రవర్తించిన తాగుబోతు యువకులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. శనివారం రాత్రి కొందరు మందుబాబులు మద్యం తాగి వీరంగం సృష్టించారు. పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్పై దాడికి పాల్పడ్డారు. ఈ విషయం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దృష్టికి వెళ్లడంతో దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకోవాలని ఆర్పేట సీఐను ఆదేశించారు. దీంతో ఆదివారం సీఐ ఏసుబాబు వారిని అదుపులోకి తీసుకుని సిటీ కేబుల్ రోడ్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. నిందితుల స్వస్థలమైన బలరామునిపేటలో కూడా రోడ్డుపై నడిపించారు. రౌడీమూకలు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్కు ఈ శిక్ష హెచ్చరికగా ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.
0 Comments