గుజరాత్లోని కచ్ ప్రాంతంలో రాబోయే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఆదివారం ప్రకటించారు. రాజ్కోట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కచ్ ప్రాంతంలో వివిధ ప్రాజెక్టుల కోసం వెచ్చించనున్నారు. రాబోయే పదేళ్లలో ముంద్రా పోర్ట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడులు కేవలం ఆర్థిక వృద్ధి కోసమే కాకుండా, వాతావరణ బాధ్యత, ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్లు కరణ్ అదానీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరణ్ అదానీ మాట్లాడుతూ అదానీ గ్రూప్ ప్రయాణానికి గుజరాత్ రాష్ట్రమే పునాది అని కొనియాడారు. "మా ఛైర్మన్ గౌతమ్ అదానీ నమ్మకం ప్రకారం మా గ్రూప్ వృద్ధి దేశాభివృద్ధితో ముడిపడి ఉండాలి. వ్యాపారవేత్తలకు గౌరవం, వేగవంతమైన నిర్ణయాలు, బలమైన వ్యవస్థలు ఉన్న గుజరాత్ మోడల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతోంది" అని ఆయన అన్నారు. రాజ్కోట్లో జరగనున్న 'వైబ్రెంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్'కు ముందు నిర్వహించిన ట్రేడ్ షోను ప్రధాని మోడీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే పదం జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందకముందే, గుజరాత్ దానిని ఆచరణలో చూపిందని కరణ్ అదానీ ప్రశంసించారు.
0 Comments