బెంగళూరు హెబ్బల ఫ్లైఓవర్, మేఖ్రీ సర్కిల్ మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ట్విన్ టన్నెల్ ను నిర్మించనుంది. ఎలివేటెడ్ కారిడార్తో పాటు ర్యాంపుల నిర్మాణానికి పూనుకుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం విలువ 2,215 కోట్ల రూపాయలు. ఈ మొత్తం అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. బెంగళూరు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉన్న హెబ్బల ఫ్లైఓవర్, మేఖ్రీ సర్కిల్ మార్గంలో స్థానిక వాహన రద్దీని నియంత్రించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. బెంగళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఏడాది మేలో జారీ చేసిన ఆదేశాల మేరకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు ఇచ్చిన రోడ్ మ్యాప్ కు ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ, బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారిలో భాగమైన ఈ మార్గాన్ని మరింత విస్తరించడం సాధ్యం కాదని నిర్ధారించిన తర్వాత సొరంగ మార్గ ప్రణాళికను రూపొందించారు. భూసేకరణలో ఇబ్బందులు, భూమి లభ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం సొరంగం మార్గాల నిర్మాణానికి మొగ్గు చూపింది. బెంగళూరు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి 2024-25 బడ్జెట్ ప్రసంగంలో సొరంగాల నిర్మాణ సంకల్పాన్ని ప్రకటించినట్లు కేబినెట్ నోట్ వెల్లడించింది. ప్రాజెక్టు అంచనా ప్రకారం- హెబ్బల లేక్ చుట్టూ భూమి అందుబాటులో ఉన్నందున, గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలోని భూమిని కూడా ఈ నిర్మాణానికి వినియోగించుకుంటారు. ఈ ప్రాజెక్టులో ఎక్కువ భాగం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను కవర్ చేస్తుంది. భూసేకరణ వ్యయాన్ని రూ. 25 కోట్లకు పరిమితం చేయాలని ప్రణాళికలో పొందుపరిచారు. ఈ టన్నెల్ రూట్ ప్రాజెక్టులో భాగంగా, మేఖ్రీ సర్కిల్ వద్ద బళ్ళారి రోడ్డు మధ్యలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఒక అండర్పాస్ నిర్మిస్తారు. దీంతో పాటు జీకేవీకే ప్రాంగణంలో భూగర్భ మార్గం, హెబ్బల సరస్సుకి ఇరువైపులా రోడ్డు నిర్మాణం జరుగుతాయి. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టినా కూడా ఎస్టీమ్ మాల్ నుండి హెబ్బాళ వరకు ఉన్న వంతెన విస్తరణను పూర్తి చేయడం సాధ్యపడలేదు. దీంతో ట్విన్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపారు.
0 Comments