Ad Code

మగవారిని నమ్మించి మోసగించడం ప్రవృత్తిగా పెట్టుకున్న నిత్య పెళ్లి కూతురు వాణి !


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి (19) నిత్య పెళ్లి కూతురుగా వార్తల్లోకి నిలిచింది. మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట మగవారిని నమ్మించి మోసగించడం ప్రవృత్తిగా పెట్టుకుంది. పెళ్లి కానీ వారిని  ఎంచుకొని వారి నుంచి ఎదురు కట్నం తీసుకొని పెళ్లి చేసుకొని, పెళ్లయ్యాక వారం రోజుల్లోనే చెప్పచెయ్యకుండా పరారవుతుంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి హ్యాండ్ ఇచ్చింది. వివాహం అనంతరం వరుడు సొంత ఊరు కర్ణాటక వెళుతున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో వరుడుతో కలిసి ట్రైన్ ఎక్కిన ఆమె విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద బాత్ రూమ్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్ళి ట్రైన్ దిగి ఎస్కేప్ అయింది. తర్వాత ఆమె ఏమైందా అని ఆందోళనకు గురైన వరుడు ,అతని కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా ఇచ్చాపురం లోని మేనత్త ఇంటికి చేరుకున్నట్టు తెలిసింది. అయితే అప్పటికే వాణికి వరుడు తరుఫు వారు లక్ష రూపాయలు ఎదురు కట్నంతో పాటు బట్టలు, ఇతర ఖర్చుల నిమిత్తం డబ్బులు వాణికి ఇచ్చారు. జాడకోసం వెతుకుతున్న వరుడి కుటుంబ సభ్యులు ఆమె మేనత్తను సంప్రదించగా వాణి అసలు వ్యవహారం అంతా బయట పడింది. విషయం తెలిసి కంగుతిన్న వరుడి కుటుంబ సభ్యులు వాణి మేనత్త సంధ్యను నిలదీయగా వారి డబ్బులు వారికి ఇచ్చేస్తామని చెప్పి, పరార్ అయ్యారు. దీంతో వాణి వల్ల మోసపోయిన బాధితులు నాగి రెడ్డి, కేశవ రెడ్డి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇప్పటి వరకు 8 మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్టు ఫోటోలను,  వీడియోలను సంపాదించి ఆధారాలుగా పోలీసులకు వాటిని అందజేశారు. బాధితుల ఫిర్యాదుపై ఇచ్చాపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాణి తల్లి చిన్నప్పుడే మృతి చెందటం తండ్రి పెద్దగా ఆమెను పట్టించుకోకపోవడంతో మేనత్త సంధ్య ఆమెను చేరదీసింది. సంధ్య గతంలో మైనర్ కావడంతో పెళ్లి పేరిట ఆమె ఇంతమందిని మోసగించిన వారెవరు గతంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. అయితే ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్ళు కావడంతో ఆమె పెళ్ళిళ్ళ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి.


Post a Comment

0 Comments

Close Menu