వందేమాతర గీతంపై అసలు వివాదమే లేనప్పుడు కేవలం బెంగాల్ ఎన్నికల కోసమే ప్రధాని మోడీ ఈ చర్చ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. వందేమాతరంపై పార్లమెంట్ లో అసలు చర్చ ఎందుకు జరగాలని ప్రశ్నించారు. తద్వారా అసలు సమస్యల నుంచి దేశం దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ, బీజేపీ నేతలపై ప్రియాంక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ వందేమాతరంపై చర్చలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారని ప్రియాంక ప్రశ్నించారు. బీజేపీ, ఆరెస్సెస్ కు జరిగిన అవమానాలపై ప్రశ్నిస్తున్న నేతలు. .. నెహ్రూకు జరిగిన అవమానాలన్నీ కూడా ఓ లిస్ట్ తయారు చేసి, దానిపై చర్చకు సమయాన్ని కేటాయించి, ఈ అధ్యాయాన్ని ముగించాలని సూచించారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్న పని కోసం పార్లమెంటు విలువైన సమయాన్ని ఉపయోగిద్దామని పిలుపునిచ్చారు. వందేమాతర గీతం దేశంలోని ప్రతి భాగంలోనూ సజీవంగా ఉంది కాబట్టి దీనిపై చర్చ అవసరం లేదని ప్రియాంక తెలిపారు. బెంగాల్ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం వందేమాతరంపై చర్చ కోరుతోందన్నారు. ప్రభుత్వం వర్తమానం, భవిష్యత్తును చూడాలనుకోవడం లేదు కాబట్టే గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవాలని కోరుకుంటోందన్నారు. వందేమాతరం కుదింపుపై మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నెహ్రూ వందేమాతరం వివాదాన్ని మతతత్వ శక్తులు సృష్టించినదని చెప్పినట్లు గుర్తుచేసారు. ఇందుకు ఆధారంగా నెహ్రూ-బోస్ మధ్య లేఖలు, నెహ్రూ-రవీంద్రనాథ్ ఠాగూర్ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను తీసుకొచ్చి చదివారు. వందేమాతరాన్ని జాతీయ గీతంగా ఎంపిక చేయడానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని ప్రియాంక తెలిపారు. ఠాగూర్ రాసిన ఓ లేఖ నుండి ఒక భాగం చదువుతూ..ఎల్లప్పుడూ పాడే రెండు పద్యాలు చాలా ముఖ్యమైనవని, వాటిని మిగిలిన కవిత నుండి, పుస్తకంలోని భాగాల నుండి వేరు చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ కూడా దీన్ని అంగీకరించిందని ప్రియాంక తెలిపారు. వారి కంటే ఇప్పుడు దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్న బీజేపీ నేతలు, ప్రధాని గొప్ప వాళ్లని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
0 Comments