మధ్యప్రదేశ్లో అధికార పార్టీ నేత ఒకరు మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మోరెనా జిల్లాలోని పోర్సా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అతివేగంతో వచ్చిన కారు రోడ్డు పక్కన చలి కాచుకుంటున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒక పదేళ్ల బాలుడు, ఒక వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన చలి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు శనివారం తెల్లవారుజామున పోర్సా-జోటై రోడ్ బైపాస్ కూడలి సమీపంలో ఒక ఇంటి ముందు కొందరు వ్యక్తులు చలిమంట వేసుకుని కూర్చున్నారు. అదే సమయంలో బీజేపీ పోర్సా యువజన గ్రామీణ విభాగం వైస్ ప్రెసిడెంట్ దీపేంద్ర భదౌరియా తన కారులో అతివేగంగా ఆ మార్గంలో వచ్చాడు. మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపిస్తున్న సదరు నేత.. వాహనంపై నియంత్రణ కోల్పోయి నేరుగా చలిమంట చుట్టూ కూర్చున్న వారిపైకి కారును ఎక్కించాడు. కారు కింద పడిన వారు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే గ్వాలియర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ 65 ఏళ్ల రామ్ దత్ రాథోడ్, పదేళ్ల అర్నవ్ లక్షకర్ మరణించారని వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు నిందితుడు దీపేంద్ర భదౌరియాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు నిందితుడిని స్టేషన్కు తరలించిన కొద్దిసేపటికే అతడు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కావాలనే అధికార పార్టీ నేతకు సహకరించి తప్పించారని ఆరోపిస్తూ బాధితుల బంధువులు, స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోర్సా-జోటై రహదారిని దిగ్బంధించి భారీ నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
0 Comments