టీటీడీ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీఏ శ్రీనివాస్, కుమార్తె కల్పజ రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో వీరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటుగా అప్పటి డీఎస్పీ మోహన్ను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 2019 మేలో బెంగళూరులోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న గెస్ట్హౌస్లో రఘునాథ్ ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. అయితే తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని రఘునాథ్ భార్య మంజు బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్తో పాటు దామోదర్, రామచంద్రయ్య, ప్రతాప్ అనే వ్యక్తుల పేర్లను ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో నకిలీ స్టాంప్ పేపర్లను ఉపయోగించి రఘునాథ్ ఆస్తిని రాయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చనిపోయిన రఘునాథ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూముల వ్యాపారం చేసేవారు. అప్పట్లో ఈ కేసును అప్పటి ఇన్స్పెక్టర్ మోహన్ దర్యాప్తు చేసి.. రఘునాథ్ది ఆత్మహత్యే అని కోర్టుకు బీ-రిపోర్ట్ సమర్పించారు. ఆ వెంటనే రఘునాథ్ భార్య మంజుల హైకోర్టును ఆశ్రయించారు.. అక్కడ వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు కేసు దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా ఆత్మహత్య అంటూ నివేదిక ఇవ్వడంతో, మంజుల మరోసారి హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. రఘునాథ్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ చెన్నై విభాగం ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగానే, ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న మోహన్తో పాటు ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
0 Comments