Ad Code

పీపల్ కోటి సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు : 60 మందికి గాయాలు


త్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో టీహెచ్డీసీ నిర్మిస్తున్న విష్ణుగఢ్ - పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన పీపల్ కోటి సొరంగంలో మంగళవారం అర్థరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్ళు ఢీకొన్నాయి. షిఫ్ట్ మార్తున్న సమయంలో కార్మికులు, అధికారులను తీసుకెళుతున్న రైలు, నిర్మాణ సామాగ్రితో వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో రైల్లో 109 మందికి పైగా కార్మికులు, అధికారులు ఉన్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో సొరంగం లోపల కార్మికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చీకటిగా ఉండే సొరంగం లోపల ఈ ప్రమాదం జరగడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో మొత్తం 60 మందికి గాయాలు కాగా, వారిలో 10 మందిని గోపేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి, మరో 17 మందిని పీపలో కోటిలోని వివేకానంద ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా అలకనంద నదిపై 444 మెగావాట్ల సామర్థ్యంతో ఈ విష్ణుగడ్-పీపల్ కోటి జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu