జనవరి 1 నుంచి మోటార్ సైకిళ్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ప్రకటించింది. ఇది భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అన్ని బైకులకు వర్తిస్తుందని వెల్లడించింది. అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా మోటార్ సైకిళ్ల ధరలను పెంచడం జరిగిందని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యు మోటోరాడ్ ఇండియా పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం స్థానికంగా ఉత్పత్తి చేసిన, దిగుమతి చేసుకున్న మోడల్లు రెండూ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా మోడళ్ల జాబితాలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్, బీఎండబ్ల్యు సీఈ 02 ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల జాబితాలో.. అడ్వెంచర్, రోడ్స్టర్, టూరింగ్, పెర్ఫార్మెన్స్, క్రూయిజర్ మోడల్లు ఉన్నాయి. BMW C 400 GT వంటి ప్రీమియం స్కూటర్లు, BMW CE 04 వంటి ఎలక్ట్రిక్ మోడళ్స్ కూడా జాబితాలో ఉన్నాయి. వీటన్నింటి ధరలు వచ్చే ఏడాది నుంచే పెరగనున్నాయి.
0 Comments