తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కవిత ఆధ్వర్యంలో రైలురోకో నిర్వహించారు. కవిత పట్టాలపై బైఠాయించిన నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని రైలురోకో నిర్వహించిన కవితతో పాటు పలువురు జాగృతి నేతలను అదుపులోకి తీసుకున్నారు. రైలు పట్టాలపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కవితోపాటు జాగృతి నేతలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కవిత, పలువురు జాగృతి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17శాతం రిజర్వేషన్లతోనే పంచాయితీ ఎన్నికలను నిర్వహించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తున్నాయని కవిత ఆరోపించారు.
0 Comments