విశాఖలో ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఏపీ-రీ ఇమేజనింగ్ పబ్లిక్ ఫైనాన్సింగ్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంస్కరణలను అందిపుచ్చుకుంటే అభివృద్ధి-సంక్షేమం జరుగుతుందని బలంగా నమ్ముతానని తెలిపారు. ఆ నమ్మకంతోనే తీసుకున్న నిర్ణయాల వల్ల అభివృద్ధి జరిగిందన్నారు. చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలకు లాభం జరిగిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మార్చుకోవాలని, పాలసీలు రూపొందించుకోవాలని కోరారు. సంస్కరణ వల్ల అభివృద్ధి జరుగుతుందనే దానికి కళ్ల ఎదుట కన్పిస్తున్న హైదరాబాద్ అభివృద్ధే నిదర్శనమన్నారు. 1999లో తీసుకున్న విద్యుత్ సంస్కరణల వల్ల ఇప్పుడు విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని బలంగా చెప్పగలనన్నారు. విభజన తర్వాత తెలంగాణ కూడా విద్యుత్ సంస్కరణల లాభాలను ఎంజాయ్ చేస్తోందన్నారు. అయితే చేసిన మంచి పనులను చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడ్డానని, దాని వల్ల ఇబ్బందులు వచ్చాయని బాబు గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు అద్భుతమైన విజయం అందించారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని హామీ ఇచ్చామని, వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా...ఆర్థిక శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే దిశగానే ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఇందులో చాలా వరకు అమలు చేశామన్నారు. కేంద్రం సహకారంతో ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ అందుతోందని, అయినా ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
0 Comments