బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా దగ్గుబాటి హీరో రానా విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఐడీ పోలీసుల ముందుకు హీరో రానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు హీరో రానాను గంటన్నర పాటు ప్రశ్నించారు. ఈ విచారణకు రానా తన బ్యాంక్ స్టేట్మెంట్లతో హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్తో రానా చేసుకున్న అగ్రిమెంట్పై సీఐడీ విచారించింది. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్తో రానాకు వచ్చిన పారితోషికంపై కూడా సీఐడీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ తాను స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానని, ఇప్పటికే ఈ కేసులో సీఐడీకి కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. రానా 2017లో బెట్టింగ్ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. తాను ఈ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయడానికి ముందు తన లీగల టీమ్తో అన్నీ పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు గతంలో రానా వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతో తాను ఒప్పందం చేసుకోలేదని రానా స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం యాంకర్ విష్ణుప్రియను కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా ప్రకాష్రాజ్, హీరో విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు సీఐడీ విచారణకు హాజరయ్యారు.
0 Comments