ఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. నవంబర్ 3-5 వరకు జరిగే సమావేశంలో నోబెల్ గ్రహీతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలతో పాటు విద్యా, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం నుండి 3,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దశాబ్దం క్రితం వరకు మహిళల సంఖ్య 100 కంటే చాలా తక్కువగా ఉండేది, ఇప్పుడు ఏకంగా 5, 000 వరకు చేరుకుందన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విద్యలో మహిళల వాటా దాదాపు 43 శాతానికి చేరిందని వెల్లడించారు. ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ అని వివరించారు. అభివృద్ధి చెందిన దేశానికి చెందిన సైన్ అండ్ టెక్నాలజీ మంత్రితో లిఫ్ట్లో వస్తుండగా, భారతీయ అమ్మాయిలు సైన్స్ అండ్ టెక్నాలజీని అనుసరిస్తున్నారా? అని అడిగారని, మన సంఖ్య చెప్పగానే ఆశ్చర్యపోయారన్నారు. మన భారతీయ కుమార్తెలు సాధించినది ఇదేనన్నారు. దీనిని బట్టి భారత దేశంలోని మహిళలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నారో గణంకాలు చూపిస్తున్నాయని మోడీ పేర్కొన్నారు. ఏఐ శక్తిని కూడా ఉపయోగకరంగా మారుస్తామని, అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ''నేడు రిటైల్ నుంచి లాజిస్టిక్స్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి పిల్లల హోంవర్క్ వరకు ప్రతిచోటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించబడుతోంది. అందువల్ల భారతదేశంలో కూడా సమాజంలోని ప్రతి విభాగానికి ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తున్నాము. ఇండియా ఏఐ మిషన్లో రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. నేడు భారతదేశం నైతిక, మానవ-కేంద్రీకృత ఏఐ కోసం ప్రపంచ చిత్రాన్ని రూపొందిస్తోంది. మా రాబోయే ఏఐ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఒక ప్రధాన అడుగు అవుతుంది. ఆవిష్కరణ, భద్రతను కలిసి అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారతదేశం గ్లోబల్ ఏఐ సమ్మిట్ను నిర్వహిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మన శక్తిని రెట్టింపు చేసుకోవాల్సిన సమయం ఇది. అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన లక్ష్యాన్ని సాధించడానికి ఇది కూడా చాలా కీలకం.'' అవుతుందని మోడీ ఆకాంక్షించారు.
0 Comments