ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాను ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. డిప్యూటీ వైస్ ఛాన్సలర్ సహా వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి ముందు పలు ప్రతిపాదనలను ఉంచారు. రాష్ట్రంలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకారించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కోర్సులకు సంబంధించిన శిక్షణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్ డిజిటల్ హెల్త్ టూల్స్ తో అనుసంధానించాలని కోరారు. టాస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో అడుగు పెట్టిన నారా లోకేష్ కు యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ (అకడమిక్) ప్రొఫెసర్ నటాలీ బ్రౌన్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీ అధిపతి ప్రొఫెసర్ గ్లెన్ జాకబ్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టాస్మానియా విశ్వవిద్యాలయ డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నటాలి బ్రౌన్ మాట్లాడారు. తమ యూనివర్సిటీకి టాస్మానియా, హోబర్ట్, లాన్సెస్టన్, సిడ్నీలలో క్యాంపస్ లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ 2లో టాస్మానియా యూనివర్సిటీ ఉందని, ఇందులో మొత్తం 40,000 మందికి పైగా విద్యనభ్యసిస్తోన్నారని వివరించారు. అందులో 15,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా క్లైమటిక్ యాక్షన్ (ది ఇంపాక్ట్ ర్యాంకింగ్), మెరైన్/అంటార్కిటిక్ సైన్స్, ఓషనోగ్రఫీలో ప్రపంచవ్యాప్తంగా టాస్మానియా యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఫార్మసీ, నర్సింగ్, రూరల్ హెల్త్, వ్యవసాయ రంగాల్లో వివిధ కోర్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. గత ఏడాది యూనివర్సిటీలో 1,500 మంది భారతీయ విద్యార్థులు ఐటి, ఇంజినీరింగ్, హెల్త్ సైన్స్, బిజినెస్ కోర్సుల్లో చేరినట్లు నటాలి బ్రౌన్ పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులకు టాస్మానియన్ ఇంటర్నేషనల్ స్కాలర్ షిప్ లు అందిస్తున్నామని చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ, వాతావరణ స్థితిస్థాపకతపై ఐఐటీలతో కలసి ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టామని, భారతీయ విశ్వవిద్యాలయాలతో కలిసి ఇంజినీరింగ్ క్రెడిట్ ట్రాన్స్ ఫర్స్ వంటి పాత్ వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్ట్రేలియాలో అమలు చేస్తున్న కఠిన అక్రిడేషన్ వ్యవస్థల తరహాలో ఏపీలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సుల్లో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. వైద్య కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీకి టాస్మానియా వర్సిటీ ఫార్మా/ హెల్త్ కే నెట్ వర్క్ ను అందించి పరిశ్రమ భాగస్వామ్యాలకు సహకరించాలని చెప్పారు. అలాగే గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఏపీలోని గిరిజన ప్రాంతాలు, మారుమూల కమ్యూనిటీలపై దృష్టి సారిస్తూ ఉమ్మడి పరిశోధనలు నిర్వహించాలని అన్నారు. ఏపీలోని నర్సింగ్, ఫార్మసీ విద్యార్థుల కోసం స్టూడెంట్/ఫ్యాకల్టీ ఎక్స్చేంజీ కార్యక్రమాలు చేపట్టాలని, జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రోగ్రామ్ మాదిరిగా ఆస్ట్రేలియా తమ విద్యార్థుల ప్లేస్ మెంట్ కోసం స్కిల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లను నిర్వహించాలని అన్నారు. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఫార్మసీ విద్యార్థుల స్కిల్ సర్టిఫికేషన్స్ ను బెంచ్ మార్కు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.
0 Comments