ఏక్తా దివస్ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 'దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే ప్రతి పౌరుడు ప్రమాదంలో ఉన్నట్టే. మన దేశం ఐక్యంగా ఉన్నప్పుడే అది శక్తివంతంగా నిలుస్తుంది' అని అన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ను స్మరించుకుంటూ ఆయన, దేశ సమగ్రతను కాపాడటమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. చొరబాట్లు, విభజనాత్మక రాజకీయాలు, అంతర్గత భద్రతా లోపాలు వంటి అంశాలపై దేశం ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం యొక్క ఏకత, సమగ్రత కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వారందరినీ తక్షణమే వెనక్కి పంపించే చర్యలు చేపడతామన్నారు. 'దేశ సార్వభౌమత్వం, భద్రత విషయంలో రాజీ అనేది ఉండదు. మన సరిహద్దుల్లోకి చొరబాట్లు జరగడం దేశానికి తీవ్ర ముప్పు' అని ఆయన పేర్కొన్నారు. గడిచిన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల దృష్ట్యా ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు సమస్యలు పెరిగాయని మోడీ విమర్శించారు. కొన్ని రాజకీయ పార్టీలు చొరబాట్లను అడ్డుకునే చర్యలకు అడ్డుపడుతూ దేశ భద్రతను బలహీనపరుస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. 'దేశానికి ముప్పుగా మారే ఈ చొరబాట్లను సమూలంగా నిర్మూలించాలి. చట్టబద్ధమైన పౌరులను రక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత. కానీ, అక్రమంగా దేశంలోకి వచ్చిన వారికి మద్దతు ఇవ్వడం దేశద్రోహంతో సమానం' అని ఆయన అన్నారు. భారతదేశ భద్రతపై ఎవరైనా విఘాతం సృష్టించే ప్రయత్నం చేస్తే, కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం ఉండదని మోడీ స్పష్టం చేశారు.
0 Comments