నితీష్ కోసం తమ డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ముజఫర్నగర్లో ఆదివారంనాడు మీడియాతో బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీష్ కుమార్ మాట్లాడుతూ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, చేసిన పొరపాటు మళ్లీ చేయనని అన్నారు. నితీష్ జనతాదళ్, లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ గతంలో మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్నారు. అయితే విభేదాల కారణంగా కొద్దికాల క్రితం మహాకూటమికి నితీష్ ఉద్వాసన చెప్పారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన పదవిలో కొనసాగుతున్నారు. ''మా కంటే ముందుకు అధికారంలోకి ఉన్న వాళ్లు చేసిందేమైనా ఉందా? ఇంతకుముందు మహిళల పరిస్థితి ఏమిటి? సాయంత్రం అయిందంటే జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు కాదు. మేము 'జీవిక దీదీ' పథకం ప్రారంభించిన తర్వాత మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు మేమున్నాం. వారితో (విపక్షాలు) కలిసి గతంలో నేను రెండుసార్లు తప్పు చేశాను. కానీ ఈరోజు నేను నా పాతమిత్రులతో ఉన్నాను. సమాజంలోని హిందువులు, ముస్లింలు, అగ్రవర్ణాలు, వెనుకబడిన తరగతలు, దళితులను కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ప్రజలు ఇది గుర్తుంచుకోవాలి'' అని నితీష్ అన్నారు. బీహార్ అసెంబ్లీకి మరో ఏడాదిలోగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, నితీష్ నాయకత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్షా, పలువురు రాష్ట్ర నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో నితీష్ ఎప్పుడు వచ్చినా అర్జేడీ ద్వారాలు తెరిచే ఉంటాయని లాలూ ప్రసాద్ ఇటీవల వ్యాఖ్యానించారు.
0 Comments