సినీనటి మాధవీలత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పేనని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతోపాటు, భాజపా నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్రెడ్డి అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం విమర్శలకు తావుతీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణ కోరుతున్నట్టు జేసీ పేర్కొన్నారు. నేడు తాడిపత్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప, వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. కొంతమంది పార్టీ మారిపోవాలని విమర్శిస్తున్నారని, తాను పార్టీ మారాలని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. డిసెంబరు 31న నన్ను నమ్మి 16 వేల మంది అక్కచెల్లెళ్లు జేసీ పార్క్కు వచ్చారు. నాగురించి మాట్లాడిన రాజకీయనాయకులంతా ఫ్లెక్సీ గాళ్లే. తాడిపత్రి కోసం ఎంత దూరమైనా వెళ్తా. రెండు సంవత్సరాల్లో తాడిపత్రి రూపురేఖలు మారుస్తా. గత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రజలు నావైపు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం'' అని జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు.
0 Comments